విఘ్నేశ్వరుడు (చందమామ)_24 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

24. మహాభారత రచన


అక్క చెల్లెళ్ళు ప్రసన్నవదనా, మోహనా వరసగా విగ్రహాల్ని చూసుకుంటూ వెళ్ళి, నిరుత్సాహంగా మరలబోతూ, అవతల పిల్లల కోలాహలానికి ఆశ్చర్యంగా చూశారు.


“అక్కడ ఒక తక్కువ రకం రంగుల విగ్రహం ఉంది లెండి!” అంటూ ఎవరో అనడం వాళ్ళకు వినిపించింది.


అది విని మోహన, “పదవే, అక్కా! అదేదో తక్కువలోనే దొరుకుతుందిలా ఉంది!” అంటూ ప్రసన్న వదన చేయి పుచ్చుకొని అటు దారి తీసింది. అంతా ఆడా, మగా జనం ప్రదర్శనశాలలో ఒక్కరు మిగలకుండా వారిని వెంబడించారు.


ప్రసన్నవదన వెళ్ళి, వరహాల సంచిని విగ్రహం ముందు పెట్టి, తన మెడలోని పచ్చల రత్నాలహారాన్ని తీసి విచిత్రుడి చేతికి కంకణంలాగ చుట్టింది.


అది చూసి జనం, “వీళ్ళకేదో పిచ్చి ఉంది! అలాంటి గొప్ప విగ్రహాల్ని కాదని ఇక్కడ డబ్బు ధారపోస్తున్నారు!” అన్నారు.


ప్రసన్నవదన వాళ్ళతో, “ఇక్కడున్న విగ్రహంలో ఏ విశేషాన్ని చూసి పిల్లలంతా మురిసి ముచ్చట పడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది. బాల దీవనలు బ్రహ్మదీవనలు, పిల్లలు దైవసమానులనీ అంటారు. అందుకే వారి ఎన్నికను శిరసావహించాము,” అన్నది.


“మట్టి శిల్పంలో లేని రూపసౌందర్యాన్ని, సొంపుల్ని సామాన్యమైన జేగురు, సున్నము, బొగ్గు మొదలైన రంగులతోనే ఎంతో మూర్తివంతంగా తీర్చిదిద్దిన చిత్రకారుని ప్రతిభ అమోఘంగా వుంది. మా బహూకరణం అతి స్వల్పం!” అని మోహన అన్నది.


ఆ సమయంలో, విచిత్రుడి వృద్ధజననీ జనకులు అక్కడికి వచ్చారు.


“నాయనా, పావనా! వాతాపి గణేశుడి కృపవల్ల మా అన్వేషణ ఫలించింది, ఇంత వాడివై కనిపించావు!” అంటూ కుమారుణ్ణి కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. అప్పుడు విచిత్రుడు బాల్యం దాటుతున్న నవయుకుడు. తలిదండ్రులను చూసి మహదానందం పడ్డాడు. గతం అంతా గుర్తుకొచ్చింది. తన పేరేమిటో తెలిసింది.


వారి సమాగమాన్ని చూసి ప్రసన్న వదన తృప్తిపడుతూ, “ఇప్పుడిప్పుడే మా కోరిక నెరవేరింది, మా మొక్కు చెల్లించు కొంటాము.” అని చెప్పింది. 


క్షణాలమీద జనం అక్కడ పెద్ద పందిరి వేశారు. విశాలమైన వేదిక అమర్చారు.


ప్రసన్నవదన వినాయక విగ్రహాన్ని అంటి పెట్టుకు కూర్చుని తాళాలు వాయిస్తూ, “తాండవ నృత్యకరీ గజానన....” అని కీర్తన మొదలుపెట్టింది. వేదిక పై మోహన విద్యుల్లతలాగ నృత్యం చేస్తూంటే, జనం పరవశించిపోతూ ఆనంద తరంగాల్లో ఊగిపోతున్నారు.


ప్రసన్నవదన గానం గజానన పండితుడికి వినిపించింది!


అప్పుడు గజాననుడు శతాధిక వృద్ధుడై ఇల్లు కదల లేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఎక్కడలేని జవసత్వాలు వచ్చాయి. పరుగులాంటి నడకతో పందిట్లోకి చేరుతూనే ప్రసన్నవదనను చూసి చేతులెత్తి జోడించి సాగిలపడి అలాగే ధ్యాన ముద్రలో ఉండిపోయాడు. 


నృత్యం చేస్తూ, చేస్తూ మోహన పెద్దదైన వినాయక విగ్రహాన్ని అవలీలగా భుజాని కెత్తుకొంది. అది చూసి తెప్పరిల్లిన జనం “అంత బరువు మోయలేవమ్మా!” అని అంటూంటే మోహన. “నాకు అలవాటేగా!” అని చెప్తూ విగ్రహాన్ని, భుజాన మోస్తూ. నాట్యం చేస్తూన్న నడకతో బయలుదేరింది. జనం అంతా ఆమె వెనకనే వెళ్ళారు. ఆ సందట్లో ఎప్పుడో అదృశ్యమైన ప్రసన్నవదన సంగతే ఎవనికి పట్టలేదు.


ధ్యానముద్ర నుండి గజాననుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విగ్రహమున్నచోట మెరుస్తున్న వరహాలతో నిండుగా ఉన్న బంగారు జలతారు సంచి కనిపించింది. పాదాల చెంత విచిత్రుడు మోకరిల్లి కూర్చుని ఉన్నాడు.


గజాననుడు విచిత్రుడితో, “ఆలయ మంటప కుడ్యాలను గణేశలీలల చిత్ర శోభితం చెయ్యి! అందుకు కావలసిన ధనాన్ని ప్రసన్నవదనుడైన విఘ్నేశ్వరుడే అందించాడుగదా!” అంటూ లేచాడు.


గజానన విచిత్రులిద్దరూ ఊరేగింపుగా వెళ్తున్న జనంతో కలిశారు.


మోహన విగ్రహంతో ఆలయ పుష్కరిణికి చేరుకొని, తటాక సోపానాలు దిగుతూ మాయమై, ఆమెకు మారుగా చిట్టెలుక

విగ్రహాన్ని వీపున మోస్తూ నీటిలోకి పరుగు తీసింది. ఆ రోజే విగ్రహాల్ని జలనిమర్జనం చేసే ఉత్సవదినం.


విగ్రహం తటాక మధ్యానికి చేరుకొని, కోటి పూర్ణిమల కాంతిపుంజంగా భాసించింది. ఆ కాంతిలో అభయ హస్తంతో ఆశీర్వదిస్తూ విఘ్నేశ్వరుడు లీలగా కనిపించి, కనిపించి అంతర్థానమయ్యాడు.


గజాననుడు విచిత్రుణ్ణి గాఢాలింగనం చేసుకొని. “నాయనా, పావనా! నీ మూలంగా వాతాపినగరానికి పావనత మిశ్రమమైంది. నీవు పావనమిశ్రుడివి!” అని చెప్పాడు, అంటూ పావనమిశ్రుడు ఆగకుండా,” గర్భాలయ ముఖద్వారం మీది చిత్తరువు మహాభారత రచన......” అంటూ చెప్పుకుపోతూంటే, యువ చిత్రకారుడు, "గురుదేవా! " అంటూ పావనమిశ్రుడి పాదాలను చేతులతో చుట్టి, “మీ పావన చరిత్రను విన్న నేను ధన్యుణ్ణి! నా పేరు ఆనందుడు. మీ పావన నామాక్షరి మొదటి రెండు అక్షరాల్ని మార్చి, నా పేరు ముందు చేర్చి, 'వపా నందుడు' అనిపించుకుంటాను. ఈ మంటపం పావన చిత్రాలయం! ఈ చిత్రాలకు ప్రతికృతులు రచిస్తాను. ముందు తరం వారికి మీరు చెప్పిన కథలన్నీ చెప్తాను. అను గ్రహించండి!” అంటూ శిరస్సు వంచాడు.


మెరుస్తున్న వెండి జుట్టుతో, ముడుతలు పడ్డ విశాల ఫాలంతో వార్థక్యం పైబడ్డా మనసుకి ముసలితనం రానివ్వని పావనమిశ్రుడు యువకుడి తలపై చేత్తో ఆశీర్వదిస్తూ, మందహాసం చేసి మళ్ళీ చెప్పసాగాడు:


వ్యాసుడు తాను చెప్పబోయే మహా భారతాన్ని వ్రాయగల సమర్థుడు ఎవరా అని ఆలోచిస్తూండగా, బ్రహ్మ సాక్షాత్కరించి, విఘ్నేశ్వరుణ్ణి లేఖకుడుగా పెట్టుకోమన్నాడు.


బ్రహ్మ ఆదేశానుసారం వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు.


విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై, “వ్యాసా! నీ ధోరణిలో నీవు చెప్పుకుపోతూండాలి, నా వంక చూడకూడదు సుమీ!” అని చెప్పి వ్రాతకు కూర్చున్నాడు.


విఘ్నేశ్వరుడు తన దంతం ముక్కనే గంటంగా పట్టి, మోపినది ఎత్తకుండా వ్రాస్తున్నాడు. వ్యాసుడు ఆరమోడ్పు కన్నులతో ధ్యానమగ్నుడై చెప్తున్నాడు.


ఎదురుగా హిమాలయ శిఖరాగ్రం నుండి పడుతున్న జలపాతం మధ్యమావతి రాగంలాగ మంద్ర గంభీరంగా నేపథ్య సంగీతంలాగ శృతి పోస్తున్నది. దేవదారు వనాలు తలలూపుతూన్నవి. జలజల పారే నదాలు అనంత రాగమాలికలు అలాపిస్తున్నవి. మహాభారత రచన ధారావాహికంగా, నిర్విరామంగా సాగుతున్నది.


పుట్టుగ్రుడ్డి ధృతరాష్ట్రుడు హస్తినాపుర సింహాసనాన్ని అలంకరించాడు. తమ్ముడు పాండురాజు సామ్రాజ్య భారాన్ని మోస్తూ విస్తరింపజేశాడు. పాండురాజుకు పంచపాండవులు, ధృతరాష్ట్రుడికి సూరుగురు కౌరవులు పుట్టారు.


చిన్ననాటి నుంచే కౌరవ పాండవుల మధ్య స్పర్థ, అసూయలు వర్ధిల్లాయి.


వ్యాసుడు చెప్తున్నాడు విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడు. సభాపర్వం సాగుతున్నది.


మయసభలో పరాభవం పొందిన దుర్యోధనుడు ప్రతీకారంగా పాండవుల్నీ వారి భార్య ద్రౌపదినీ జూదంలో గెల్చుకొని ద్రౌపదీ వస్త్రాపహరణ తలపెట్టాడు. భీముడు దుర్యోధనుడి తొడలు విరగ్గొడతాననీ, దుశ్శాసనుడి రక్తం తాగుతాననీ సింహగర్జన చేశాడు.


పాండవులు వనవాసం చేశారు. విరాట రాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు. సైరంద్రిగా ఉన్న ద్రౌపదిని కీచకుడు అవమానించి భీముడి చేతిలో ముద్దయ్యాడు. ఉత్తరగోగ్రహణంలో బృహన్నల విజయుడయాడు. మహాభారతంలో సుందరకాండగా విరాటపర్వం సాగింది.


జలపాతం కళ్యాణి రాగం ధ్వనిస్తున్నది.


అభిమన్యుడికి ఉత్తరకు వివాహం జరిగింది. కృష్ణుడు రాయబారం వెళ్ళి పాండవులకు ఐదు ఊళ్ళు యిస్తే చాలన్నాడు. దుర్యోధనుడు సూది మొనపాటి నేల కూడా యివ్వనన్నాడు.


యుద్ధం అనివార్యమైంది. హిమాలయ ఝరి కదనకుతూహలరాగం ఆలపిస్తూ శిఖరాలు విరిగి పడుతున్నవా అన్నట్లుగా వడి హెచ్చి పడుతూన్నది. హిమానీ నదాలు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి.


కృష్ణుడు అర్జునిడి రథసారథి అయ్యాడు. అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు. జలపాతం సామ సౌరాష్ట్ర దేవగాంధార రాగాలను వినిపిస్తున్నది.


భీష్ముడు అంపశయ్య చేరాడు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుణ్ణి పదిమందీ కలిస్తేనేగాని చంపలేక పోయారు. సుభద్ర పుత్రశోకంలాగ జలపాత ధ్వని ముఖారి రాగంగా వినిపిస్తున్నది.


అర్జునుడు విజృంభించాడు. ద్రోణుడి తల ద్రుష్టద్యుమ్నుడు నరికాడు. అనేక అనర్థాలు సంతరించుకొన్న కర్ణుడిని నమ్ముకొని దుర్యోధనుడు కర్ణుడి చావుతో పూర్తిగా చిత్తయ్యాడు. భీముడు దుశ్శాసనుణ్ణి చంపాడు, దుర్యోధనుడి తొడలు విరగొట్టాడు.


జూదంలో ఓడిపోయిన ధర్మరాజు తమ్ములతో యుద్ధంలో విజయదుందుభి మ్రోగించాడు.


కృష్ణుడు అవతారం చాలించాడు.


పరీక్షిత్తుకి పట్టంకట్టి పాండవులు ద్రౌపదితో మహాప్రస్థానం బయలుదేరారు.


ధర్మానికి చావులేదు, చివరకు నిలబడేది ధర్మ మొక్కటే అన్నట్లుగా ధర్మరాజు మేరుశిఖరాగ్రం మీద నిలబడ్డాడు.


జలపాత ధ్వని క్షీణిస్తున్నది. అంతటా గంభీర నిశ్శబ్దం ఆవరించుకున్నది. వ్యాసుడు చెప్పింది విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడా? లేక విఘ్నేశ్వరుడు వ్రాసింది. వ్యాసుడు చెపుతున్నాడా? అన్నట్లు చకచకా భారత రచన సాగింది. సత్యలోకంలో పద్మాసనంపై బ్రహ్మ సంతృప్తిగా చిరునవ్వు చిందిస్తూ, సాభిప్రాయంగా సరస్వతి వంక చూశాడు. వెంటనే సరస్వతీదేవి వీణ మీటుతూ శ్రీ రాగాన్ని పలికించింది.


మహాభారతం చెప్పడం పూర్తి కావస్తున్నది. చివరి పర్వంలో ఉన్నది.


సరస్వతీ దేవి సత్యలోకం నుండి మంగళాచరణంగా శ్రీరాగం ఆలాపిస్తున్న వీణానాదం, తాను చెప్పుతున్న కథనానికి అంతరాయంగా వ్యాసుడి చెవిని సోకింది.


ఇంకా చెప్పవలసినది చాలా ఉంది. వ్యాసుడు ఆదమరుపుగా లేఖకుడి దెనతేరి చూశాడు. మరుక్షణంలో విఘ్నేశ్వరుడు అంతర్థానమయ్యాడు.


మహాభారతం గ్రంథం మీద ఆకాశం నుండి అక్షతల్లాగ పువ్వులు జలజలా రాలాయి.


వ్యాసుడు ఆత్రంగా గ్రంథాన్ని విప్పి పరిశీలనగా చూశాడు. తాను ఇంకా చెప్ప దలచినదంతా ఒక్క అక్షరం తేడా లేకుండా సంపూర్ణంగా వ్రాయబడి ఉంది! వ్యాసుడు ఆనందాశ్చర్యాలతో పులకించి పోతూండగా, మహతివీణ పై హంస ధ్వని రాగం వినిపించింది.


నారదుడు వస్తూనే, “ఏమిటి మహా భారత మహర్షీ! ఆశ్చర్యపడిపోతూ చూసుకుంటున్నావు?” అన్నాడు.


వ్యాసుడు జరిగినది చెప్పాడు.


“అంటే, నీవు చెప్పేది చెప్పకుండానే, ముందుగానే నీ లేఖకుడు వ్రాసుకుంటూ వచ్చాడన్నమాట!” అన్నాడు నారదుడు.


“ఔను, నారదా! అదే జరిగింది. అటువంటి లేఖకుడు ఎలాటి తపస్సులు చేసినా ఎవరికీ లభించడుకదా! నేను ధన్యుణ్ణి! నా సంకల్పం జయప్రదమైంది! మహాభారతాన్ని 'జయం' అని కూడా పేర్కొంటున్నాను!” అని చెప్తూ వ్యాసుడు చేతులు జోడించి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించాడు.


మహాభారతం దగ్గిర పెద్ద జ్యోతి పెరుగుతూ కనిపించింది.


ఆ జ్యోతి విఘ్నేశ్వరుని ఆకారంగా రూపొందింది.


విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి, “వ్యాస మహార్షీ! నీ మహాభారతం అద్వితీయ మహాకావ్యమై పంచమ వేదంగా పరిగణింపబడుతూ కీర్తింపబడుతుంది!” అని, వ్యాసుణ్ణి ఆశీర్వదిస్తూ అంతర్హితుడయ్యాడు.


విఘ్నేశ్వరుని చేత అతని దంతపు గంటంతో లిఖింపబడి అక్షరసిద్ధి పొందిన మహా భారతం, అన్ని కాలాల్లో సారస్వతాకాశంలో చుక్కల్లో చందమామగా నిలిచింది.

--(సమాప్తం)

Post a Comment

Previous Post Next Post