విఘ్నేశ్వరుడు (చందమామ)_19 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

19. కలహకంఠి, కలహదుందుభిల కథ


గుహద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులక రాయిలాగ తొండంతో లాగేసి, గజరాజు లోపలికి వెళ్ళి కొంత సేపయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్ప వేసింది. చంద్రహారాల్నీ, కంఠాభరణాల్నీ ఆమె మెడనిండా వేసి, తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపునిమిరి, మిగతా నగలను ధరించినన్ని ధరించి, తక్కినవి మూట గట్టుకొని తీసుకెళ్ళమని సైగ చేసి చెప్పింది.


సౌదామిని అలాగే చేశాక, ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి, అరణ్యంలోకి వెళ్ళి పోయింది.


బంగారు విగ్రహంలాగ నగలతో తళుక్కు, తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి, సంబాళించుకొని. మెల్ల మెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచ్చా యో చెప్పేవరకూ వేధించి, సౌదామిని చెప్పిన దంతా విని, “ఏనుగకి వెలగపళ్ళు అంత ఇష్టమన్న మాట!” అని తల పంకించి, వెంటనే సంతకు వెళ్ళి సంచినిండా వెలగ పళ్ళు కొనుక్కువచ్చింది.


నగలు నింపుకొని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకొని, వెలగపళ్ళ సంచితో కలహకంఠి బయలుదేరింది.


అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనపడక విసిగి, ఒక చింతచెట్టు కింద చతికిలబడి, తినాలని వెలగపండు తీసింది.


తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని, వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని, గొంతు సవరించుకొని, 

“ఏనుగా రా రావే!

వెలగపళ్ళు తినవే!

నగలెన్నో తేవే!

నా కోర్కె తీర్చవే! 

ఏనుగా రా!

వేగంగా రా!” --అంటూ భజనపాట మొదలు పెట్టింది. పాట సాగుతున్నది, ఏనుగు రాలేదు గాని, అడవి దద్దరిల్లేలాగ గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంఠి సంతోషపడుతూ మెడచాచి చూడగా , పెద్దపులి దూకుతూ రావడం కనిపించింది.


భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గిరే పడింది. గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగి పోతూ గుహలోకి వెళ్ళింది.


గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తినదానిలాగ తల మునిగేలాగ నగలన్నీ వేసుకొని, గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి, ఎత్త లేక ఎత్తి, మోయలేక మోస్తూ, నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కోరపళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటి లాగ కనిపించింది.


ఆ భూతం ప్రతి ధ్వనితో గుహ కంపించిపోయేలాగ, “ఓహ్హెూ! కలహకంఠీ! నువ్వు కోడలిని కాల్చుకుతినే అత్తవైతే, నేను అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని! నా చరిత్ర విను!” అంటూ చెప్పడం ప్రారంభించింది:


వెనకటికి నేను చురకత్తి లాంటి అందకతైను. అమ్మా, నాన్నా పెట్టిన కలహంసి; కాపురానికెళ్ళాక, నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికీ నేను సంపాదించుకొని సార్థకపరుచుకొన్న పేరు కలహదుందుభి.


నువ్వెంత చెడ్డ అత్తవో, కలహకంఠీ! నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు.


నేను కాపరానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో! నాకు నగలపిచ్చి ఇంతా అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్ల నుంచి అన్ని నాకే యిచ్చేసింది.


అటువంటి అమాయకురాలైన అత్తను, ఒక పూటైనా సరిగా తిననిచ్చేదాన్ని గాను. చిక్కి శల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని.


చివరికి నా అత్త, మామ విసిగిపోయి వాతాపిక్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను మూద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవడంలో, ఆవిడ తూలి పడిపోయి, ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది.


అంతవరకూ ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు, ఆపలేని దుఃఖంతో, పైకుబికిన కోపంతో, “పాపిష్ఠిదానా! నువ్వు మా కోడలి వైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి! ఎప్పటికైనా, మా ఒక్క గాని ఒక్క కొడుకు తిరిగి వస్తావనీ, నువ్వు వాణ్ణి సుఖ పెట్టగలవనే ఆశతో, అన్నీ సహించాము; కడసారి కోరుతున్నాను --వాడొస్తే సరిగా చూడు!” అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపశ్శాలి.


అదే సమయంలో, ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. నా అత్తమామల మృతదేహాల పైబడి రోదిస్తూ, నేను లాక్కో బోయేటప్పుడు కిందపడిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు.


ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్లతో కాల్చేస్తున్నట్టు చూస్తూ, “నువ్వు బ్రహ్మ రాక్షసిగా పుట్టవలసినదానివి!” అని అన్నాడు. అంతే, తర్వాత వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్లిపోయాడు.


ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకి పరవశించి కోరి చేసుకున్న నా భర్తే! అని బ్రహ్మరాక్షసి చెప్పి కాస్సేపాగి మళ్ళీ చెప్పసాగింది:


నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే, నేను కొంతమంది గజదొంగలను చేరదీశాను. దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలో నే దొంగలు గొప్ప గొప్ప నగలను ధనరాసులను పోగు పోస్తూండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్లు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు.


కలహకంఠీ! ఇదే గుహలో, ఆ నగల్నీ, ధనరాసుల్నీ చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి, ఇలాగ భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగ చేస్తే, నా పిశాచజన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది.


ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే: ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవీ, అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో! అన్నది బ్రహ్మరాక్షసి.


కలహకంఠి భుజానికెత్తుకొన్న గోతం కట్టువిడి దాంట్లోంచి పాములూ, జెర్రులూ, కొండ తేళ్ళూ ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకూ పాకాయి.


ఒంటి మీద పాములూ, తేళ్ళూ పాకుతూంటే బెంబేలు పడిపోతున్న కలహ కంఠిని చూసి గుహ మారుమ్రోగుతూండగా బ్రహ్మరాక్షసి వికవికా నవ్వుతూ, “నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంఠివి. నేను అత్తమామల ఉసురుపోసుకున్న కలహ దుందుభిని! ఉత్తమురాలైన నీ కోడల్ని మంచి గా చూసుకొంటే సరేసరి, లేదా ఈ గుహలో నాలాగ బ్రహ్మరాక్షసివై పడి ఉండటం ఇహ నీ వంతు అవుతుంది! విన్నావా. కలహకంఠీ!” అని చెప్పింది.


కలహకంఠి లెంపలు వేసుకొని, రాక్షసికి దణ్ణం పెట్టి, “బుద్ధి వచ్చింది. కోడల్ని పువ్వులాగ చూసుకుంటాను. గుహ నుండి నన్ను జయట పడనిచ్చి, అరణ్యం దాటించు!” అని మొర పెట్టింది.


బ్రహ్మరాక్షసి కలహకంఠిని అడవి దాటించి కళ్యాణినగరం పొలిమేరకు చేర్చి, “మాట తప్పావో, బ్రహ్మపిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త!” అని హెచ్చరించి భగ్గుమని మండి పోయి అదృశ్యమైంది.


కలహకంఠి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి, సౌదామిని ముందు మోకరిల్లి, మోకాళ్ళు పట్టుకొని, “అమ్మా, సౌదామినీ! నన్ను మన్నించు. కొడుకూ, కోడలూ చిలకాగోరువంకల్లాగ ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావల్సిందేమీ లేదు!” అన్నది.


అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంఠి తిరిగి కలకంఠి అనిపించుకొన్నది.


పావన మిశ్రుడు కథను ముగించి, “పిల్లలూ! ఏనుగ ఎవరో చెప్పుకోండి చూదాం!” అన్నాడు.


పిల్లలే కాకుండా, పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గొంతెత్తి, “విఘ్నేశ్వరుడు! మన విఘ్నేశ్వరుడే!” అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్లకు వెళ్లారు.


ఆలయమంటపంలోని కుడ్యచిత్తరువులకు సంబంధించిన కథలను, రోజూ పావనమిశ్రుడు చెబుతూంటే, ఆ వీనుల విందుగా వింటూన్న పిన్నల, పెద్దల మనస్సులనిండా, విఘ్నేశ్వరుడి పై బలమైన భక్తి వర్ధిల్లింది.


ఒకనాడు ఒక సంగీత కళాభిమాని, ఒక కుడ్యచిత్తరువులో తంబుర మీటుతూ ఒక విద్వాంసుడు గానం చేస్తూంటే, వివిధ భంగిమల్లో విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తూండడం చూసి, ఆ చిత్ర చరిత్ర చెప్పమని కోరాడు; పావనమిశ్రుడు చెప్పడం మొదలు పెట్టాడు:


వాతాపినగరం కళలకు కాణాచిగా కవిపండిత, గాయక, విద్వాంసులకు పుట్టినిల్లై విలసిల్లుతవాన్నది.


గజానన పండితుడు నగరంలో అగ్రగణ్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి;

ముఖ్యంగా గొప్ప గాయకుడు. అతని గాత్రంలో సమ్మోహన శక్తి ఉండేది. వాతాపి గణపతిపై ఎన్నెన్నో కీర్తనలు రచించి పాడుతూండేవాడు. అతని మనుమడు బాలగణేశభట్టు టింగుటింగున తాళాలు వాయిస్తూండేవాడు.


గజాననుడు 'ధిమికిట ధిమికిట తాండవ నృత్యకరీ గజానన....' అనే పల్లవిని ఎత్తుకొని రాగాలు మారుస్తూ, అనేక రాగాల్లో పాడుతూంటే, గజాననుడైన విఘ్నేశ్వరుడు ఇంద్రధనుస్సు రంగుల్లో అనేక రూపాల్లో నర్తిస్తూ శ్రోతల కన్నులకు కటేవాడు.


హంసధ్వనిరాగంలో తెల్లని రాజహంసలాగ, మాయామాళవ రాగంలో ఉదయరవి బింబంలాగ, భైరవిరాగంలో ఎర్ర తామరలాగ, హిందోళ రాగంలో నీలాకాశంలాగ. నీలాంబరి రాగంలో నీలి కలువలాగ, ఆనందభైరవిరాగంలో అరవిచ్చిన తెల్ల కలువల పై విరిసిన పున్నమి వెన్నెలలాగ విఘ్నేశ్వరుడు లీలగా కనిపించేవాడు.


గజానన పండితుడికి సత్కారాలమీద, సన్మానాల మీద కాంక్ష ఏ కోశానా లేక పోయినా, అత్యున్నత సత్కారమైన బంగారు గణేశ ప్రతిమ అతనికే ప్రతి సంవత్సరం వస్తూండేది. ఆ ప్రతిమలతో అతని ఇల్లు నిండిపోయింది.


దేశాంతరంగా చాలా మంది మహామహా విద్యాంసులకే గజాననుడంటే ఎనలేని గౌరవమూ, గురుభావమూ ఉంటున్నా, వాతాపి నగరంలో కొంతమందికి అతనిపై అసూయ బాగా పెరిగింది. వారందరికీ నాయకుడు స్వరకేసరి.


స్వరకేసరి ఎప్పుడూ విద్వత్తు చూపడానికి గొప్ప తాపత్రయ పడేవాడు. అతను గళం విప్పితే సింహగర్జనలు వెలువడేవి. మద్దెల వాయించేవాడిని ముప్పతిప్పలు పెడుతూ వీరవిహారం చేస్తున్నట్లు పాడేవాడు. గజాననపండితుడికి అటువంటి విద్వత్తు ప్రదర్శించుకోవాలనే యావ లేక పోవడమే కాకుండా, విఘ్నేశ్వరుడిపై భక్తితో తన్మయావస్థలో పడి తాళం తప్పుతూ, మరొకప్పుడు పాడుతూ, పాడుతూ మూగబోతూండేవాడు. అటువంటి సందర్భాలను స్వరకేసరి ప్రభృతులు గజాననుడికి శాస్త్ర పాండిత్యం లేదనీ, కేవలం అతనిది మనోధర్మగానమనీ గాలిపాట అనీ హేళనగా ప్రచారం చేస్తూ, అక్కసు తీర్చుకుంటూండేవారు. గజాననుడికి ఎవరేమన్నా, ఏమనుకుంటూన్నా ఆ ధ్యాసే ఉండేది కాదు. మనసులోని విఘ్నేశ్వరుడితో ఏకాంతంలో మంతనాలాడుకొంటున్నట్లు పాడేవాడు. అందులో ఏదో అనిర్వచనీయమైన శక్తి వింటున్నవారిని మైమరపించి దివ్యలోకాల్లోని ఆనంద సాగరాల్లో ముంచి తేల్చేది.


ఏ విధంగా నైనా ఆ సంవత్సరం స్వర్ణ గణేశ విగ్రహం గజానన పండితుడి ఇల్లు చేరకుండా చేయడానికి స్వరకేసరి బాగా ఆలోచించి, ఒక గొప్ప పథకం వేశాడు.

--(ఇంకా వుంది)

Post a Comment

Previous Post Next Post