విఘ్నేశ్వరుడు (చందమామ)_15 Vignaeswarudu Novel (CHANDAMAMA)

 విఘ్నేశ్వరుడు (చందమామ) 

Vignaeswarudu Novel (CHANDAMAMA)

15. వాతాపి గణపతి

 

పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ,  ధౌమ్యుడు పురోహితుడుగా గణేశవ్రతాన్ని చేసి, మారు వేషాలతో విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించారు.


కృష్ణుని అండతో పాండవులు కౌరవులతో యుద్ధం చేసి విజయం పొందారు. హస్తినాపురంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ, అశ్వమేధ యాగాన్ని చేయడానికి తల పెట్టాడు.


యాగాశ్వం వెంట సైన్యసమేతంగా అర్జునుడు బయలుదేరాడు. పాండవుల  పురోహితుడైన ధౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు.


యాగాశ్వం అనేక రాజ్యాల మీదుగా వెళ్ళింది. రాజుల నేకులు ధర్మరాజు పాలనకు వినయవిధేయతలు ప్రకటిం చారు. గుర్రం వెళ్తూ, వెళ్తూ ఒక ప్రాంతంలో ఆగిపోయి మరి ముందడుగు వేయలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయి ధౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగిందని అడిగాడు. ధౌమ్యుడు 'చెపుతా పద' అన్నట్లు చూసి దారి తీశాడు. కొంత దూరం వెళ్ళగా ఒక మహానగరం కనిపించింది. ఆ నగర మధ్యంలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నది. ఒక పెద్ద కొండరాతిని మలచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై విరాజిల్లుతున్నది.


“అర్జునా! విఘ్నేశ్వర దేవుడిని అర్చించి ప్రణామములు అర్పించు. తరవాత వాతాపి గణపతిగా పేరుపొందిన ఈ దేవుని గురించి, వాతాపినగరం గురించి సవిస్తరంగా చెప్తాను,” అని అన్నాడు ధౌమ్యుడు.


అర్జునుడు పూజాక్రమం జరిపి, వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో ఆరాధించాక ధౌమ్యుడు వాతాపి నగరంలోకి దారి తీశాడు. అతని వెనుక అర్జునుడు వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహా వైభవంతో వెలిగిన ఛాయలు గోచరించాయి. కాని ఇప్పుడు నగరం ఆలనా పాలనా లేక బీడుపడి ఉన్నది. లెక్కకు రాని కొద్ది మంది పౌరులు కనిపించారు. అర్జునుడి రాకకు వారు సంతోషంతో స్వాగతం పలికి, పాలనా వ్యవస్థ ఏర్పరిచి నగరాన్ని పునరుద్ధారణ చేయమని ప్రార్థించారు.


“అర్జునా! ఇది వాతాపినగరం. నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వరుడు అగస్త్య మహామునిచే నెలకొల్పబడిన అద్భుత శిల్పం. ఇది వాతాపి గణపతి క్షేత్రంగా పిలువబడుతున్నది. విశేషాలు చెప్తాను విను!” అంటూ ధౌమ్యుడు చెప్పడం ప్రారంభించాడు:


గంగ, కవేరుడు అనే రాజర్షి కమండలువులో పడి కావేరిగా రూపు ధరించి, అతని కుమార్తెగా ఆశ్రమంలో పెరిగింది. అగస్త్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో చెప్పాడు.


కవేరుడు తన సమ్మతిని తెలిపి, “అగస్త్యా! కావేరి అభిమతం కూడా తెలుసుకుంటే మంచిది గదా!” అన్నాడు.


అగస్త్యుడు ఆశ్రమంలో కావేరితో  చనువుగా ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్యపర్వతం మీద వనవిహారం చేయాలని ఉందని చెప్పింది. అగస్త్యుడు కావేరిని తీసుకెళ్ళాడు.


వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో తామరపువ్వును చూసి  ముచ్చటపడుతూ, కావేరి చరచరా వెళ్ళి,  దాన్ని తీసుకోడానికి మడుగులో అడుగు పెట్టింది. నీటితాకిడితో ఆమె అమాంతంగా జలరాశిగా, మారిపోయి, వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాల నుండి జలజలా జారుతూ కావేరి నదిగా పరవళ్లు తొక్కుతూ ప్రవహించింది.


అగస్త్యుడు కావేరినే తలచుకొంటూ చాలా కాలం బ్రహ్మచారిగానే ఉండిపోయి, గొప్ప తపస్సు చేసి ఋషి శ్రేష్ఠుడు అనిపించుకున్నాడు. ఒకనాడతడు అరణ్యంలో చెట్టుకొమ్మకు తల క్రిందులుగా వేలాడుతున్న పితృ దేవతలను చూసి, ఎవరు మీరు? ఎందుకిలా ఉన్నారని అడిగాడు.


వారు నిట్టూర్పులు విడుస్తూ, “మా వంశీకుడు అగస్త్యుడు ఒక ఇంటివాడై  సంతానంక నేవరకూ ఇలాగే ఉంటాము!” అని చెప్పారు.


అగస్త్యుడు తన దివ్యదృష్టితో విదర్భ  రాజుకు కావేరి అంశతో కుమార్తె పుట్టి, లోపాముద్ర పేరుతో పెరిగి యుక్త వయస్కురాలై ఉన్నట్లు తెలుసుకొని వెళ్లి, ఆమెను తన కిచ్చి వివాహం చేయవలసిందని విదర్భరాజును కోరాడు.


కందమూలాలు తింటూ నార కట్టుకు తిరిగే మునికి సుకుమారి రాకుమారిని ఎలా యివ్వడం? యివ్వకపోతే శపిస్తాడేమో అని రాజు సంశయపడుతూ వ్యాకుల చిత్తుడై ఉండగా, లోపాముద్ర అగస్త్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని చెప్పింది..

విదర్భరాజు ఆ విధంగానే లోపాముద్రను అగస్త్య మహర్షికిచ్చి అతనితో పంపాడు.


అగస్త్యుడు లోపాముద్రతో తన ఆశ్రమానికి వచ్చాక ఒకనాడు, “నా పితృ దేవతలను పున్నామనరకం నుండి తరింపజేయడానికి నీ వలన సంతానం కనాలని నిన్ను వివాహం చేసుకున్నాను!” అని లోపాముద్రతో అన్నాడు.


అప్పుడామె తన ముతక చీర చూసుకొని విచారిస్తూ, “వివాహం చేసుకోగానే సరా! నేను రాజపుత్రిక గా పుట్టి పెరిగినదాన్ని. నాకు తగ్గ మంచి బట్టలు, రత్నాభరణాలు  సమకూర్చడం నీ విధి. అందుకు కావలసినంత ధనం సంపాదించుకు రావడం నీ కర్తవ్యం!” అన్నది.


అగస్త్యుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి, ధన సేకరణకు బయలుదేరాడు. అతడు చాలామంది రాజుల దగ్గరికి వెళ్ళి, రాజ్యపాలనకు సరిపడగా మిగిలిన ధనాన్ని తనకిమ్మన్నాడు. ఏ రాజు  కూడా మిగులు చెప్పలేదు సరికదా ఎంతో లోటు పడుతూన్నట్లుగా చెపుతూ, తమకు కూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గం చూపమని వేడుకున్నారు.


అగస్త్యుడు హతాశుడై అరణ్యమార్గంలో వెళ్తూ, ఒక చోట ఉన్నతమైన ఒక మహా శిలను చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నేశ్వరుడిని పోలినట్టుగా కనిపించింది. ఆ మహాశిలనే విఘ్నేశ్వరుడిగా భావిస్తూ అగస్త్యుడు నమస్కరించి, “గణపతీ! తపస్సు తప్పితే రెండో ధ్యాస లేని వాణ్ణి. ధన సంపాదనకు విద్య లేవీ నాకు తెలియవు. ధనం నాకు ఎలాగ లభిస్తుంది? నీవైనా నాకు ఒకదారి చూపవా?” అంటూ వేడుకున్నాడు.


అప్పుడు, “ఏమిటి, మహర్షి! శిలతో మంతనాలాడుతున్నావు!” అంటూ  విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు.


అగస్త్యుడు ప్రణమిల్లి మ్రొక్కి తన మొర వినిపించాడు.


విఘ్నేశ్వరుడు, “అగస్త్యా! రావలసిన చోటుకే వచ్చావు, రావలసినవాడివే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను

భోజనానికి పిలుస్తాడు, వెళ్ళు! ఇల్వలుడి దగ్గిర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది. నీ వలన కాగల కార్యం కూడా ఉంది!” అన్నాడు.


అగస్త్యుడు, “గణపతీ! ఈ మహా శిలలో నీ పోలికలు నాకు కనిపించాయి. అందుచేత, ఈ శిల అపూర్వ గణపతి విగ్రహంగా రూపొందాలనే నా కోరిక కూడా సఫలంచెయ్యి!” అని కోరాడు.


విఘ్నేశ్వరుడు, “అలాగే అవుతుందిలే!” అని చెప్పి అంతర్థానమయ్యాడు.


అగస్త్యుడు చాలా అలసి ఉన్నాడు. ఆకలిగా కూడా ఉంది. ఆయాసంగా మహా శిలను ఆనుకొని కూర్చొని అలా చూస్తూండగా, అతిధులను వెంటబెట్టుకొని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు. అగస్త్యుడికి విషయమంతా తృటిలో తెలిసిపోయింది.


ఆ అరణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే గొప్ప మాయావులైన రాక్షసులు ఋషులను, యాత్రికులను, బాటసారు లను చంపి ధనాన్ని దోచుకొని, పెద్ద రాతిదుర్గంలో పోగుచేస్తున్నారు. ధర్మము మూర్తీభవించిన మహా రాజు వేషంతో ఇల్వలుడు అతిథ్యానికి తీసుకువచ్చిన వారికి వినయవిధేయతలతో మర్యాదలు కుశల ప్రశ్నలు జరుపుతున్న సమయంలో, వాతాపి బాగా కొవ్వుపట్టిన మేకపోతుగా మారుతాడు. ఇల్వలుడు ఆ మేకను తెచ్చి చంపి వండించి, మేకమాంసంతో భోజనం పెడతాడు.


అతిథులు భుక్తాయాసంతో విశ్రమిస్తున్న సమయంలో ఇల్వలుడు గొంతెత్తి, “వాతాపీ!” అని పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టలు చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగస్త్యుడి ఒళ్ళు మండిపోయింది.


ఇల్వలుడు అగస్త్యుణ్ణి సమీపించి, వీడెవడో చాలా గొప్ప ఋషిలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను ఎంతమందిని హత మార్చితే అంత మంచిది. అని అనుకుంటూ సవినయంగా భోజనానికి ఆహ్వానించాడు.


అగస్త్యుడు ఆకలితో అలమటించి పోతూన్నవాడిలాగ పరమానందం కనబరిచి, “ఓ ధర్మదాతా! నీ లాంటి వాళ్ళుండబట్టే యీ భూ మండలం అనంతాకాశంలో యిలా నిలిచి ఉంది. పద!” అంటూ ఇల్వలుడి వెంట రాతి దుర్గానికి వెళ్ళి, “ఓ అన్నదాతా! చాలా రోజులుగా తిండి లేదు, ఆకలి దహించేస్తున్నది. వెయ్యి యజ్ఞాలు జరిపించినవాణ్ణి కావడంవల్ల, మేక మాంసం తప్పితే మరేదీ అరగని రోగం ఒకటి పట్టుకున్నది. అంచేత, ముందు నాకు ఆ మాంస భోజనం పెట్టి నన్ను పంపించు.” అన్నాడు.


ఇల్వలుడు, “స్వామీ! మీ కోసమే రాసి పెట్టి ఉన్నది కాబోలు, మా ఇంట చిరకాలంనించీ ఒక మేకపోతు పెరుగుతూ బాగా కొవ్వు పట్టి ఉన్నది!” అని చెబుతూ వెంటనే మేక రూపంలో ఉన్న వాతాపిని చంపించాడు.


అగస్త్యుడు మేకను చూసి, “ఆహా! ఏం మేక, ఏం మేక! వెయ్యి యాగాలు చేయించానన్న మాటే గానీ ఇలాంటి మేకను రుచి చూడలేదు, నాయనా! ముందు దీని గుండె కాయ మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి, ఆ తర్వాత మిగతాది అతిథులకు పెట్టు! ముందే చెబుతున్నాను, మరేం అనుకోకు. మాంసం తప్ప మరేదీ నేను తినలేను సుమా! నేను తినగలిగినంతా నాకు వడ్డించాలి, మర్చి పోకు!” అన్నాడు.


ఇల్వలుడు అగ్నిలో మేకను కాల్చి, మాంసం వండించి అగస్త్యుడికి పెట్టాడు. ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం ఆరగించి త్రేన్చాడు. ఇల్వలుడు ఆశ్చర్యంతో పాటు కొంచెం భీతి కూడా పడుతూ, “స్వామీ! తమరు మంచి ఘనాపాఠీలాగున్నారే!” అన్నాడు.


అగస్త్యుడు చిరునవ్వి, “ఘనాపాఠీల్లో ఘనాపాఠిగా మన పేరు ముల్లోకాలకూ తెలుసునోయీ! ఏదీ, కాస్త మద్యం తెప్పించు! ఒక కుండెడు చాల్లే!” అన్నాడు.


ఇల్వలుడు. మరింత నివ్వెరపోతూ, “కుండెడు మద్యం తాగుతారా, స్వామీ!” అన్నాడు.


అగస్త్యుడు, “మన పొట్టకు సముద్రాలే చాలవు!” అన్నాడు.


ఇల్వలుడు, “అలాగే తాగుదురు గాని. మా వాడు వాతాపి తెప్పిస్తాడు!” అని చెబుతూ, “వాతాపీ!” అంటూ గొంతెత్తి కేక వేశాడు.


అగస్త్యుడు నెమ్మదిగా, “ఇంకెక్కడి వాతాపి! వాతాపి మరి రాడు. జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం!” అంటూ కడుపు నిమురుకుంటూ, “వాతాపి హరించి పోయాడు!” అన్నాడు.


ఇల్వలుడు ప్రాణ భీతితో గజగజ వణికి పోతూ జాడ లేకుండా పారిపోయాడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యాకాండల మాయా నాటకం అంతమైంది.


ఆ తరువాత అగస్త్యుడు మిగతా అతిథులకు జరిగిందంతా చెప్పి, రాతి దుర్గంలో కుప్పతెప్పలుగా పడి ఉన్న అస్తిపంజరాల్నీ, కపాల రాసులనూ చూపించాడు. వారంతా గుండెలు బాదుకుంటూ, బ్రతికి బయట పడ్డందుకు అగస్త్యుడికి ప్రణమిల్లి మొక్కారు.


ఆ దుర్గంలో పదిలంగా భద్రపరిచి ఉన్న ధనరాసుల్ని అగస్త్యుడు చూశాడు. తనకు కావలసినది పోగా మిగిలిన ధనంతో ఒక మహానగరం నిర్మించవచ్చు. వేలాది మంది సుఖంగా జీవించవచ్చునని ఆయనకు తోచింది.


వెంటనే అగస్త్యుడు అందరికీ ధనాన్ని పంచడం మొదలు పెట్టాడు. ఆ సంగతి విని, సమీప రాజ్యాల నుండి ఎంతో మంది ప్రజలు అక్కడకు చేరుకొని, అగస్త్యుడిచ్చిన ధనంతో ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు.


అగస్త్యుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగ కనిపించిన మహాశిల కేంద్రంగా చుట్టూరా ఒక మహానగరం తయారైంది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం వాతాపి నగరంగా పేరు పొందింది. అగస్త్యుడు స్వపరిపాలనా సూత్రాలను శిలాఫలకాల మీద చెక్కించి, నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రాయమైన ప్రజారాజ్యం ఏర్పడింది.


--(ఇంకా వుంది)


Post a Comment

Previous Post Next Post